శ్రీశైలం : క్షేత్రానికి వచ్చే యాత్రికులు తరచూ ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కరించాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం పరిపాలనా విభాగంలో అన్ని విభాగాల సిబ్బందితో సమావేశమై తీసుకున్న నిర్ణయాలపై సాయంత్రం విలేకరులకు వివరించారు. సమావేశంలో సంవత్సరాలుగా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది తమ అనుభవాలను తెలుపాలని సిబ్బంది సూచించారు. తద్వారా సమస్యల పరిష్కారం సులభతరమవుతుందన్నారు.
ఈ సందర్భంగా వసతి విభాగం, ఆర్జిత సేవా టికెట్ కౌంటర్లను గంగా గౌరీ, మల్లికార్జున సదన్ వద్ద ఏర్పాటు చేసేందుకు.. ప్రసాదాల విక్రయాలు, క్యూలైన్ల నిర్వహణ, ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు వంటి వాటితోపాటు అంతంత మాత్రంగా అందుబాటులో ఉండే ఆన్లైన్ సేవలను మరింత మెరుగుపరిచి ప్రతి భక్తుడు క్యూఆర్ స్కాన్ ద్వారా ఆలయ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకునేందుకు ఇంజినీరింగ్, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ స్తంభించకుండా ఎప్పటికప్పుడు సెక్యూటీ టీంతో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రత్యేక భద్రతా అధికారి నర్సింహారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో ఈఈ మురళీబాలకృష్ణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లయ్య, ఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్ పాల్గొన్నారు.