అంబాలా: బిడ్డలను కని చెత్త కుప్పల్లోనో, ముళ్ల పొదల్లోనో, రైల్వేస్టేషన్లలోనో, బస్టాండ్లలోనో వదిలివెళ్లే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట కన్న తల్లులే తమ పేగు బంధాలను వదిలేసి వెళ్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలోని అంబాలా కంటోన్మెంట్ బస్టాండ్లో అలాంటి ఘటనే జరిగింది.
నాలుగైదు రోజల వయసున్న మగబిడ్డను ఓ తల్లి బస్టాండులోని టాయిలెట్స్లో విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్లోకి వెళ్లిన ఓ ప్రయాణికురాలు పసికందును గమనించి బస్టాండ్లోని అధికారులకు సమాచారం ఇచ్చింది. అస్వస్థతకు గురై ఉన్న ఆ చిన్నారిని అధికారులు స్థానికంగా ఉన్న సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆ చిన్నారి పుట్టుకామెర్లతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు.
కాగా, ఘటనపై బస్టాండ్ అధికారులు స్థానిక లాల్ కుర్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బస్టాండ్లో పసికందును వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.