Rishi Sunak | ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్లో కొత్త శకం ఆరంభమైంది. దాదాపు 200 ఏండ్ల పాటు భారత్లో వలస పాలన సాగించిన బ్రిటన్లో భారత సంతతి నేత రిషి సునాక్.. ఆ దేశ ప్రధానిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం బకింగ్హమ్ ప్యాలెస్కు వెళ్లి కింగ్ చార్లెస్-3తో సమావేశమయ్యారు. చార్లెస్-3 ఆహ్వానం మేరకు క్యాబినెట్ను ఏర్పాటు చేశారు.
అంతకుముందు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్.. తన అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో చివరి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అటుపై తన రాజీనామా లేఖను రాజు చార్లెస్-3కి సమర్పించారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ప్రమాణం చేసేందుకు మార్గం సుగమమైంది. చివరి క్యాబినెట్ భేటీ తర్వాత లిజ్ ట్రస్ మాట్లాడుతూ రిషి సునాక్ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంచి రోజులు ముందు ఉన్నాయన్నారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
గతంలో కన్జర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో మంత్రులుగా రిషి సునాక్, లిజ్ ట్రస్లు పని చేశారు. కరోనా వేళ బోరిస్ జాన్సన్ అనుసరించిన వైఖరి, స్కామ్ల్లో చిక్కుకుపోతుండటంతో రిషి సునాక్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేయడంతో బోరిస్ జాన్సన్ ప్రధానిగా వైదొలగక తప్పలేదు. దరిమిలా జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్తోపాటు లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కానీ, మెజారిటీ టోరీ పార్టీ సభ్యులు లిజ్ ట్రస్కే ఓటేశారు. కానీ, ఇచ్చిన హామీ మేరకు సంపన్నులపై పన్నుల్లో కోత విధించడంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది.
ఎకానమీని గాడిలో పెట్టలేక సతమతమైన లిజ్ ట్రస్.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. అధికార కన్జర్వేటివ్ పార్టీ అంతే వేగంగా నూతన ప్రధాని ఎంపిక చేపట్టింది. రిషి సునాక్తోపాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ పోటీ పడ్డారు. కానీ.. పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత బోరిస్ జాన్సన్ ప్రకటించడంతోనే రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. పెన్నీ మోర్డాంట్ చివరి వరకు పోటీ పడినా.. అవసరమైన వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టలేక వైదొలిగారు. ఫలితంగా రిషి సునాక్ ఏకగ్రీవంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.