హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): చదువుల తల్లి సరస్వతి చెంతనే ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో ఈ ఏడాది 71% మంది అమ్మాయిలే చేరారు. మొత్తం 1,500 (జనరల్ క్యాటగిరీలో 1,404, స్పెషల్ క్యాటగిరీలో 96) సీట్లలో ఐదు విడతల కౌన్సెలింగ్ ముగిసే సరికి 1,466 సీట్లు నిండాయి. వీటిలో అమ్మాయిలు 1,047, అబ్బాయిలు 419 సీట్లు దక్కించుకొన్నారు. స్పెషల్ క్యాటగిరీలో 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఐదో విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందినవారు ఫీజు చెల్లించేందుకు, రిపోర్టింగ్కు సోమవారం వరకు గడువు ఇచ్చినట్టు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు చెప్పారు. వర్సిటీ క్యాంపస్లోని 4 ఎకరాల్లో ఎకోపార్క్ను ఏర్పాటు చేస్తున్నామని, దీనిని గ్రీన్జోన్గా అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం మినీ స్టేడియంను ఏర్పాటు చేయడంతోపాటు కరోనాతో నిలిచిపోయిన ఇన్సూరెన్స్ను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. వర్సిటీ పర్యవేక్షణతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం వీసీ డ్యాష్బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చామని, ఉద్యోగుల సెలవులు, పనితీరును ఈ డ్యాష్బోర్డు ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. విద్యార్థులకు త్వరలో ప్లేట్లు, గ్లాస్లు, బూట్ల లాంటి వస్తువులు.. నవంబర్లో ల్యాప్టాప్లు అందజేస్తామని వెంకట రమణ తెలిపారు.