హజారిబాగ్ (జార్ఖండ్), సెప్టెంబర్: రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఇచాక్ పోలీస్స్టేషన్ పరిధిలోని బరియానాథ్కు చెందిన మిథిలేశ్ మెహతా అనే దివ్యాంగ రైతు మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. రూ.1.3 లక్షలు తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో ట్రాక్టర్ తీసుకెళ్తామని హెచ్చరిస్తూ గురువారం రైతు ఫోన్కు మెసేజ్ వచ్చింది.
హైవే-33లోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ను శుక్రవారం తీసుకెళ్లేందుకు రుణ రికవరీ ఏజెంట్ ప్రయత్నించాడు. రుణం 1.2 లక్షలు చెల్లిస్తామని, ట్రాక్టర్ను తీసుకెళ్లవద్దని రైతు ప్రాధేయపడ్డాడు. 3 నెలల గర్భిణి అయిన రైతు కూతురు కూడా ట్రాక్టర్ను తీసుకెళ్లవద్దని కోరింది. ఏదీ వినిపించుకోని రికవరీ ఏజెంట్.. గర్భిణిపై నుంచి ట్రాక్టర్ను తీసుకెళ్లడంతో ఆమె చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని హజారిబాగ్లోని ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం ఎదుటపెట్టి ఆందోళన చేపట్టారు. ఈ కేసులో నలుగురిపై హత్య కేసు నమోదు చేసి, రికవరీ ఏజెంట్, ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ సహా నలుగురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.