హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇది కక్ష కాకపోతే మరేమిటి? తెలంగాణ కార్మికులపైనే అక్కసు వెళ్లగక్కటం ఏమిటి? సంస్థను కాపాడుకోవటం కార్మికుడి విధి. ఆ హక్కుతోనే సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నందుకు సమ్మె సైరన్ మోగించాడు. సమ్మె చేయటం శ్రామికుడి హక్కు. దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఆ సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపితం అంటూ విచక్షణ లేని వ్యాఖ్యలు చేసింది. కార్మికుడిని ఎగతాళి చేసేలా, వారి హక్కులను కాలరాసేలా వ్యవహరించింది. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. “సింగరేణి సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత సమ్మె. యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శక వేలం విధానాన్ని కొనసాగిస్తున్నది. సింగరేణి సమ్మె దేశ ప్రయోజనాలకు విఘాతం. సింగరేణి సంస్థకు ఇది మంచి పరిణామం కాదు” సోమవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్న మాటలివి. వేలం ప్రక్రియను వ్యతిరేకించటం దేశ ప్రయోజనాలకు విఘాతమా? సంస్థ అస్తిత్వాన్ని కాపాడుకోవటం మం చి పరిణామం కాదా? తిండి పెడుతున్న సింగరేణి ఉనికి కోసం కార్మికులు సమ్మె చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపితం ఎలా అవుతుంది? ప్రహ్లాద్ జోషి దీనికి సమాధానం చెప్పు. వాస్తవానికి తెలంగాణపై కేంద్రానికి ఉన్నది కక్ష. చూపిస్తున్నది వివక్ష. అవును! మిగతా రాష్ర్టాలు అడగ్గానే బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను ఆపేసిన మోదీ సర్కారు.. తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినా, కార్మికులు వేడుకొన్నా స్పందించటం లేదు. మరి దీన్నేమంటారు? బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ అడగ్గానే లిగ్నైట్ బ్లాక్ ఆ రాష్ర్టానికి కేటాయించింది. తమకు అనుకూలంగా ఉండే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కోరగానే వేలం నుంచి బొగ్గు బ్లాక్లను తొలగించింది. తెలంగాణ విజ్ఞప్తిని మాత్రం పట్టించుకోలేదు.
బ్లాక్ల కేటాయింపు
బొగ్గు బ్లాక్లను కేటాయించాలని ప్రభుత్వాలు కోరితే కేంద్రం దానిని పరిశీలించి కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రెండు రకాలుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోల్ ఇండియా లాంటి సంస్థలు. ఇక గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), ఒరిస్సా మైనింగ్ కొర్పొరేషన్ (ఓఎంసీ) లాంటివి ఆయా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఇలాంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 51 శాతం ఉండగా, కేంద్రం వాటా 49 శాతం ఉంటుంది.
అడిగిన వెంటనే కోల్ ఇండియాకు కేటాయింపులు
కోల్ ఇండియా సంస్థకు ఇప్పటి వరకు 118 బొగ్గు బ్లాక్లను కేంద్రం కేటాయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే తనకు తానుగా కోరుకొని, వెంటనే కావాల్సినన్ని బ్లాక్లను కేటాయిస్తూ వస్తున్నది. గుజరాత్లో ఉన్న ఉన్న ఒక బ్లాక్ను జీఎండీసీకి కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వెంటనే లిగ్నైట్ బ్లాక్ను కేంద్రం జీఎండీసికి కేటాయించింది.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
సింగరేణి సంస్థపై, కార్మికులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలపై యావత్తు తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణి సంస్థను, దాని మనుగడను కాపాడుకోవడానికి కార్మికులంతా ఏకమై (సమ్మె చేసిన సంఘాల్లో బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎంస్ కూడా ఉన్నది) మూడ్రోజుల పాటు తమ జీతాలను కూడా వదులుకొని సమ్మె చేశారు. ఇలాంటి సమయంలో సింగరేణిని, కార్మికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రజలు మండిపడుతున్నారు.
సర్వే చేసిన సింగరేణికే సున్నం
2017లో కేంద్రం చేసిన చట్టం ప్రకారం.. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల పరిశోధనలు, గనుల సర్వే, డ్రిల్లింగ్ సామర్థ్యం నాలుగు సంస్థలకే ఉన్నది. ఆ నాలుగు సంస్థలే.. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), కోల్ మైన్ ప్లానింగ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ), మినరల్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్)తోపాటు సింగరేణి(ఎస్సీసీఎల్). ఈ నాలుగు సంస్థలే కేంద్రం గుర్తించిన అధికారిక సంస్థలు అని ఇండియన్ స్టాండర్డ్ ప్రెస్ రిలీజ్లో కూడా పేర్కొన్నది. ఇలా గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు నిల్వలపై సింగరేణి సంస్థే సర్వే చేసి, డ్రిల్లింగ్ చేసి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ సంస్థకే బ్లాక్లను ఇవ్వకుండా కావాలనే అడ్డం పడుతుండటం కేంద్రం వైఖరిని స్పష్టం చేస్తున్నది.
తెలంగాణకే ఎందుకు అన్యాయం?
జేవీఆర్ ఓసీ-3, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్-3, కేకే-6 ఇైంక్లెన్ బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పలుమార్లు కోరింది. సింగరేణి సంస్థ కూడా కేంద్రానికి, బొగ్గు మంత్రిత్వశాఖకు మొరపెట్టుకొన్నది. కానీ కేంద్రం ఈ విజ్ఞప్తిని వినీ విననట్టు పక్కనబెట్టి వేలం వేస్తున్నది. ఇదే కాదు.. ఒడిశాలో ఉన్న ఒక బ్లాక్ను ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ)కు కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పెడచెవినపెట్టి వివక్ష చూపుతున్నది. తనకు అనుకూలంగా ఉండే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు కోరగానే 2020 జూలై, సెప్టెంబర్లో నిర్వహించిన వేలం ప్రక్రియ నుంచి పలు బొగ్గు బ్లాక్లను కేంద్రం విత్డ్రా చేసుకొన్నది. బాందర్, ఫతేపూర్ ఈస్ట్, మదన్పూర్ (నార్త్), మోర్గా-2, సైంగా, మోర్గా సౌత్ బ్లాక్లను వేలం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణలోని నాలుగు బ్లాక్లను వేలం వేయొద్దని స్వయంగా సీఎం కేసీఆరే ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోకుండా, అలా వీలు కాదు.. తాము పారదర్శకంగా వేలం వేస్తామంటూ కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. మిగతా రాష్ర్టాలపై ఉన్న ప్రేమ కేంద్రానికి తెలంగాణపై ఎందుకు లేదు?.