Indigo Revolution | 1859- 60లలో బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు అవసరమైన నీలిరంగు కోసం వారు భారతదేశంలో నీలిమందును పెద్దయెత్తున సాగుచేసేందుకు పూనుకున్నారు.
ఈ క్రమంలో రైతులు బలవంతగానైనా నీలిమందు పంట సాగుచేసేలా పీడనకు దిగారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్ రైతులు పీడనకు గురయ్యారు. దీనికోసం రైతులు స్థానిక జమీందార్లు, బ్రిటిష్ తోటల యజమానుల నుంచి డబ్బులు అడ్వాన్సుగా పొందేవాళ్లు. రైతులు వారి భూముల్లో ఆహార ధాన్యాలు సాగుచేయకుండా, కేవలం నీలిమందు మాత్రమే పండించేలా బ్రిటిష్ వారు ఒప్పంద పత్రాలను రాయించుకునేవాళ్లు. అయితే నీలిమందు పండించినందుకు వారికి చాలా కొద్దిమొత్తమే దక్కేది. దాంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయేవారు. ఈ దుస్థితిని తప్పించుకోవడానికి.. తోటల యజమానులపై పోరాటమే మార్గంగా భావించారు బ్రిటిష్ వారు.
నీలిమందు విప్లవం 1859 మార్చిలో మొదలైంది. బెంగాల్ రాష్ట్రం నడియా జిల్లాలోని (ఇప్పుడు బంగ్లాదేశ్) రైతులు విప్లవంలో పెద్దయెత్తున పాల్గొన్నారు. ఉద్యమానికి దిగంబర్ బిశ్వాస్, బిష్ణుచరణ్ బిశ్వాస్ నాయకత్వం వహించారు. ఇకనుంచి నీలిమందు పండించకూడదని రైతులు తీర్మానించారు. ఉద్యమానికి బాగా ప్రచారం లభించడంతో బెంగాల్లోని ఇతర ప్రాంతాలకూ పాకిపోయింది. స్థానిక జమీందార్లు రైతుల పక్షం వహించారు. బెంగాలీ విద్యావంతులు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు.
కలకత్తా దినపత్రికలు ఉద్యమాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేశాయి. రైతులపై ఆంగ్లేయ తోటల యజమానుల అకృత్యాల నేపథ్యంతో దీనబంధు మిత్రా ‘నీలదర్పణ్’ నాటకం రాశారు. పరిస్థితి విషమిస్తుండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ‘నీలిమందు చట్టం’ ఆమోదించింది. నీలిమందు విప్లవం బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటేమీ కాదు. అయితే, సంఘటితంగా పోరాడితే పీడన నుంచి విముక్తి పొందవచ్చని నిరూపించింది.