బెంగళూరు, సెప్టెంబర్ 20: కర్ణాటకలో అధికార బీజేపీ నేతల కమీషన్ల వేధింపులు తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువకముందే.. ఆ రాష్ట్రంలో అవినీతికి మరొకరు బలయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవినీతిని భరించలేక ఓ పర్యావరణ వేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. అట్టడుగు వర్గాలకు చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవడంపై అతడు ప్రశ్నించాడు. వారికి న్యాయం జరుగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అయినా.. అతడు అనుకున్నది జరుగకపోవడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేవనగరె జిల్లాలో జరిగింది. రాజ్యోత్సవ అవార్డు గ్రహీత అయిన వీరాచారి (68) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు పర్యావరణ ప్రేమికుడు. ఎక్కడికెళ్లినా వెంట మొక్కలు తీసుకెళ్లి నాటుతాడు. పౌర సరఫరాల దుకాణాల్లో జరుగుతున్న అవినీతిపై చాలాసార్లు నిరసన తెలిపాడు. ప్రభుత్వం పంపిణీ చేసే సరుకులు అట్టడుగు వర్గాలకు అందడం లేదని, వారికి న్యాయం జరుగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అయ్యింది. కాగా, మంగళవారం అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఆందోళనకు దిగారు. జిల్లా కమిషనర్ సంఘటనా స్థలానికి వచ్చి, విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న హరిహర రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని, ఆందోళన విరమింపజేశారు.