అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మనిషి లేచి కూర్చోవడం లేదా శరీరాన్ని కదిలించడం అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి ఘటనే మెక్సికోలో జరిగింది. శవపేటికలో ఉంచిన మూడేళ్ల బాలిక చేయి కదిలించింది. కళ్లు తెరిచి చూసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు. వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బతికుండగానే తన పాప చనిపోయిందని ప్రకటించారని పాప తల్లి ఆరోపించింది.
మెక్సికోలోని విల్లా డీ రమోస్ ప్రాంతంలో కమిలా రోక్సానా తన మూడేళ్ల కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా (3)తో కలిసి నివసిస్తోంది. మెన్డోజా ఆగస్టు 17న తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడింది. దీంతో ఆమెను తల్లి స్థానిక పిల్లల వైద్య నిపుణుడి వద్దకు తీసుకెళ్లింది. మెన్డోజాను పరీక్షించిన వైద్యుడు ఆమెకు డీహైడ్రేషన్ చికిత్స అందించాలని సూచించాడు. మరో దవాఖానకు రెఫర్ చేశాడు. పారాసిటమల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించాడు. కాగా, మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు పాప పరిస్థితి విషమించింది. అక్కడి వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినా మెన్డోజా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమెను ఎమర్జెన్సీ రూంకు తరలించి, చికిత్స అందించారు.
పాపకు ఆక్సిజన్ పెట్టారు. చేతి వేలికి ఆక్సీమీటర్ తొడిగగారు. దాదాపు పది నిమిషాలపాటు ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించారు. పాప చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. డీహైడ్రేషన్ కారణంగానే చనిపోయిందని తెలిపారు. దీంతో మెన్డోజాను ఆమె తల్లి, బంధువులు ఊరికి తీసుకెళ్లారు. మరుసటిరోజు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, చిన్నారిని ఉంచిన శవ పేటిక కిటికీపై పొగమంచు (శ్వాసవల్ల ఏర్పడింది)ను గమనించిన తల్లి రోక్సానా..కుటుంబ సభ్యులతో తెలిపింది. వారు ఆమె మాటలను తేలిగ్గా తీసుకున్నారు. కొద్దిసేపటికే పాప కళ్లు కదిలించినట్లు మెన్డోజా బామ్మ గుర్తించింది. దీంతో కుటుంబ సభ్యులంతా శవపేటిక తెరిచారు. పాప నాడిని పరిశీలించారు. మెన్డోజా ప్రాణంతో ఉన్నట్టు గుర్తించి అంబులెన్స్లో హుటాహుటిన దవాఖానకు తరలించారు.
వైద్యులు ఆమెకు మళ్లీ చికిత్స మొదలుపెట్టారు. పాపను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా కొద్ది సేపటికే మెన్డోజా మరణించింది. పాప బతికున్నా చనిపోయినట్టు ప్రకటించిన డాక్టర్లపై తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆమె పేర్కొంది. కాగా, శాన్ లూయిస్ పోటోసి స్టేట్ అటార్నీ జనరల్ జోస్ లూయిస్ రూయిజ్ ఈ ఘటనపై స్పందించారు. శవపరీక్ష పురోగతిలో ఉందని, బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.