ఈ నెల 28 నుంచి రైతుబంధు
నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు
తొమ్మిదో విడుతకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
మే 31 వరకు దరఖాస్తు చేసుకున్న కొత్తవారికి కూడా సాయం
సాగు సమయంలో పైసలు చేతికొస్తుండడంతో కర్షకుల ఆనందం
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నది. సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి వానకాలం, యాసంగికి కలిపి రూ.10 వేలు జమ చేస్తున్నది. కొత్తగా మే 31 వరకు కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ చాన్స్ ఇవ్వనున్నది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 3,46,518 మంది రైతులు ఉండగా..రూ.704.69 కోట్లు పంపిణీ చేయనున్నారు. సాగు సమయంలో పెట్టుబడి చేతికొస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, కూలీకి డబ్బులు ఉపయోగపడుతాయని పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ప్రారంభమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్న మయ్యారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే తరుణంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా వానకాలం, యాసంగి పంటలకు సంబంధించి ప్రభుత్వం తొమ్మిదో విడుత రైతుబంధు సాయాన్ని అందిస్తున్నది. రూ.5వేల చొప్పున రెండు సీజన్లకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ యేడాది వానకాలం పంట పెట్టుబడి డబ్బులను ఈ నెల 28 నుంచి ఇవ్వనున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలిపి 3,27,353 మంది రైతులు రూ.503.49 కోట్లు పంపిణీ చేయనుంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.1,48,818 మంది రైతులకు రూ.277.26 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,78,535 మంది రైతులకు రూ.226.23 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 1,19,165 మంది రైతుల ఖాతాల్లో రూ.201.2 కోట్లు జమ కానున్నాయి.
కొత్త వారికీ అవకాశం ఇచ్చిన సర్కారు..
కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సర్కారు కల్పించింది. దీంతో కొత్తగా భూమి కొనుగోలు చేసి.. పట్టాదారు పుస్తకం, ఆఫీసు కాపీని మే 31వ తేదీలోపు రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు అందించారు. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వానకాలం పంటల కోసం రైతుబంధు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తొలకరి జల్లులు కురియడంతో సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు, చేలల్లో దుక్కులు దున్నడం, తదితర వాటికి ఈ పెట్టుబడి సాయం ఎంతో అవసరమవుతుంది. రైతులకు ఎలాంటి రందిలేకుండా సకాలంలో సర్కారు రైతుబంధు అందిస్తున్నది.