న్యూఢిల్లీ: ప్రభుత్వ హెచ్చరికలకు ట్విటర్ దిగి వచ్చినట్లే కనిపిస్తోంది. పాకిస్థాన్, ఖలిస్తాన్కు చెందిన 1178 అకౌంట్లు, వాళ్లు చేసిన పోస్టులను బ్లాక్ చేయాల్సిందిగా ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను ట్విటర్ పాటించింది. ఇప్పటికే వీటిలో 97 శాతం బ్లాక్ చేసినట్లు ట్విటర్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం సాయంత్రం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో ట్విటర్ ప్రతినిధులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక చట్టాలకు కట్టుబడకపోతే కఠిన చర్యలు తప్పవని ఆ సమావేశంలో ప్రభుత్వం హెచ్చరించింది.
ఆ అకౌంట్లను బ్లాక్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ సమావేశానికి ముందు ట్విటర్ కేవలం 500 అకౌంట్లను మాత్రమే బ్లాక్ చేసి.. మిగతా వాటిని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అలాగే ఉంచింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభ సాక్షిగా ట్విటర్ సహా ఇతర సోషల్ మీడియా సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.