న్యూఢిల్లీ: స్వల్ప కోవిడ్ లక్షణాలున్నవారు సీటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్స్రే తీస్తే చాలని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. సీటీ స్కాన్ కేవలం కొన్ని మరకలను మాత్రమే చూపిస్తుందని, అవి చికిత్స లేకుండానే పోతాయని ఆయన పేర్కొన్నారు. లక్షణాలు లేనివారిలో 30 నుంచి 40 శాతం మంది కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు, సీటీ స్కాన్ చేస్తే ఊపిరి తిత్తుల్లో చిన్నచిన్న మరకలు కనిపించాయని, అవి చికిత్స లేకుండానే తగ్గిపోతాయని అధ్యయనాల్లో తేలిందని గులేరియా వివరించారు. ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్సరేలతో సమానమని, తదుపరి కాలంలో కేన్సర్లు రావడానికి ఇది కారణం కావచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువతకు చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. అనుమానం ఉంటే ఛాతీ ఎక్స్రే తీయించుకోవాలని, సీటీ స్కాన్ విషయంలో నిర్ణయం మాత్రం వైద్యునికే వదిలివేయాలని గులేరియా సూచించారు. అంటే పేషంట్లు సీటీ స్కాన్ గురించి పట్టుబట్టవద్దని ఆయన అభిప్రాయం.