న్యూఢిల్లీ : భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తలను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయమని తెలిపారు. పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.