తిరువనంతపురం:
కేరళ శాసనసభ ఎన్నికల్లో తన సంఖ్యాబలం పెంచుకోవడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. కేరళ ప్రజలు బీజేపీని పూర్తిగా తిప్పికొట్టారు. ఆదివారం వెలువడిన తాజా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. గత శాసనసభలో ఉన్న నెమోమ్ సీటును కూడా ఈ సారి కోల్పోయి ‘సున్నా’ స్థానాలకు పరిమితమైంది. శాసనసభ ఎన్నికల ముందు తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ బిజెపి అధ్యక్షుడు కే సురేంద్రన్ ప్రకటించారు. అయితే ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయి. స్వయంగా కేరళ బిజెపి అధ్యక్షుడు బరిలోకి దిగిన మంజేశ్వర్ నియోజకవర్గంలోనూ బిజెపి ఓటమి పాలయ్యంది. తొలిరౌండ్లలో నెమోమ్ నుండి పోటీ చేసిన రాజశేఖరన్ కొంత ఆధిక్యత కనపరిచినప్పటికీ కౌంటింగ్ ముగిసే సమయానికి ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానంలో ఎల్డిఎఫ్ అభ్యర్థి వి. శివన్కుట్టి 2025 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొలి రౌండ్లలో బిజెపి శ్రేణుల్లో ఆశలు రేపిన పాలక్కాడ్ నియోజకవర్గ పరిస్థితి కూడా ఇంతే. ఇక్కడ బరిలోకి దిగిన మెట్రో శ్రీధరన్ కాసేపు ఆధిక్యత ప్రదర్శించారు. చివరకు యుడిఎఫ్ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. త్రిసూర్లో బిజెపి తరపున బరిలోకి దిగిన ప్రముఖ నటుడు సురేష్గోపి కొన్ని గంటల పాటు ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ చివరకు మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇక్కడ ఎల్డిఎఫ్ అభ్యర్థి పి. బాలచంద్రన్ 1,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.