హైదరాబాద్: కరోనా వైరస్ మ్యుటేషన్ అవుతున్నది. అంటే జన్యుపరమైన మార్పులకు లోనై కొత్త అవతారాలు ఎత్తుతున్నది. వీటికే బ్రిటన్ స్ట్రెయిన్, ఆఫ్రికా స్ట్రెయిన్ అని రకరకాల పేరు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఇండియా స్ట్రెయిన్ అని కూడా అంటున్నారు. అయితే కేవలం వైరస్ మాత్రమే కాకుండా దానివల్ల కలిగే లక్షణాలూ మారుతున్నాయని అంటున్నారు.
కళ్లు ఎర్రబడడడం, చెవుల్లో రొద, కడుపులో ఇబ్బందిగా ఉండడం ఇప్పుడు తాజాగా కరోనా లక్షణాల జాబితాల్లో చేర్చారు. వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు ఉంటే మీకు కరోనా సోకి ఉండవచ్చు. గతేడాది తొలి దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం, శ్వాస సంబంధమైన సమస్యలను కరోనా లక్షణాలుగా గుర్తించారు.
ప్రస్తుతం విస్తరిస్తున్న రెండో దశలో పైన పేర్కొన్న వాటితో పాటు కొత్తగా ఈ మూడు లక్షణాలను కూడా పరిశోధకులు జాబితాలో చేర్చారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం, వినికిడి సమస్యలు, జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా కరోనా లక్షణాలుగానే పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.
కళ్లు గులాబీ వర్ణంలోకి మారడం కూడా కరోనా లక్షణమేనని చైనాలో జరిగిన ఓ అధ్యయనంలో బయటపడింది. కళ్ల కలక, కళ్ల వాపు, కంటి నుంచి అదే పనిగా నీరు కారడం.. మొదలైన వాటిని కూడా కరోనా లక్షణాలుగానే గుర్తించాలని సదరు అధ్యయనం పేర్కొంది. చైనాలో రెండో దశలో ప్రతి 12 మందిలో ఒకరు కంటి సంబంధ సమస్యలతో బాధపడ్డారట.
వినికిడి సమస్యలు కూడా
కరోనా జాబితాకెక్కాయి. చెవిలో అదే పనిగా గింగురుమనడం, వినికిడి సమస్యలు తలెత్తడం కూడా కరోనా లక్షణాలేనని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురితమైన అధ్యయనం ధ్రువీకరించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్.. వినికిడి సమస్యలకు కూడా కారణమవుతుందని సదరు అధ్యయనం స్పష్టం చేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వినికిడి సమస్య ఎదుర్కొనే ప్రమాదం 7.6 శాతమని 24 అధ్యయనాలు పేర్కొన్నాయి.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్
అంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా కరోనా లక్షణాల కిందకే వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, వికారం కూడా కరోనా లక్షణాలే. తరచుగా ఉదర సంబంధ సమస్యలు ఎదురవుతుంటే కరోనా పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.