హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్కు సమీపంలోని రీడింగ్ నగరంలోని టాక్ కార్యాలయ ఆవరణలో సంఘం ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి మువన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలు వృథా కాకుండా దేశ ఉన్నతికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. వారి కలలను మనమందరం సాకారం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశ కీర్తిప్రతిష్టలు పెంచేలా చేయడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అహింసా మార్గాన్ని ఎంచుకొని గాంధీజీ ఎలాగైతే స్వాతంత్య్రాన్ని సాధించారో అదే బాటలో నడిచి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఒకప్పటి తెలంగాణ పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా మారుతున్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఈవెంట్స్ కార్యదర్శి మల్లా రెడ్డి బీరంని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అభినందించారు.
కార్యక్రమంలో టాక్ మాజీ అధ్యక్షురాలు పవిత్రారెడ్డి కంది, సలహా మండలి వైస్ చైర్మన్ సత్యం రెడ్డి కంది, కమ్యూనిటీ వ్యవహారాల చైర్పర్సన్ నవీన్ రెడ్డి, రవి రెటినేని, మల్లా రెడ్డి, భూషణ్, మౌనికా, కేవీ ప్రసాద్, అవినాష్ కవ్వా, శ్రుజన రాచెర్లా, పృథ్వీ రావుల, శశిధర్ రెడ్డి, మాధవి, నరేష్, వీర్ నాయుడు, సుభాష్, ధర్మేంద్ర, నాగార్జున, అనిల్ రాజ్ దుబ్బా, మేరీ, నరేందర్ జక్కుల తదితరులు పాల్గొన్నారు.