హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖోస్లా ట్విట్టర్లో ఈ సంగతి తెలిపారు. సత్వరమే కోవిడ్ రోగులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆలస్యమైతే అధిక ప్రాణనష్టం జరుగుతందని ఆయన పేర్కొన్నారు. నిజానికి భారత్ వంటి పెద్ద దేశానికి ఈ సాయం సరిపోదని అన్నారు. 20 వేల ఆక్సిజన్ కాంసంట్రేటర్స్, 15 వేల సిలిండర్స్, 500 ఐసీయూ బెడ్స్, 100 వలెంటిలేటర్లు, 10 వేల బెడ్లు కావాలంటూ ఇండియాలోని స్వచ్ఛంద సంస్థలు, ఆస్పరత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఖోస్లా తెలిపారు. తక్షణమే చేయాల్సింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. తమ కుటుంబం తరఫున కోటి డాలర్లు ఇస్తున్నామని, మిగతా దాతలు కూడా ఇతోధికంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులతో ఇండియా సతమతమవుతున్న సంగతి తెలిసిందే.