క్విటో: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో ఉన్న మూడు జైళ్లలో ఖైదీలు ఘర్షణపడ్డారు. కిక్కిరిసిపోయిన జైళ్లలో జరిగిన కొట్లాటల్లో సుమారు 75 మంది ఖైదీలు మరణించినట్లు సమాచారం. అయితే డ్రగ్ గ్యాంగ్ల మధ్య ఆ హింస చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని జైళ్లలో జరిగిన హింసాత్మక ఘర్షణల గురించి ఆన్లైన్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జైళ్లలో భారీ స్థాయి హింస చోటుచేసుకోవడం ఈక్వెడార్ చరిత్రలో ఇదే తొలిసారి. మాదకద్రవ్యాల వ్యాపారంపై పట్టు కోసం ప్రత్యర్థి గ్యాంగ్లు హింసకు దిగినట్లు తెలుస్తోంది. దేశంలో ఉన్న మూడు పెద్ద జైళ్లలో ఈ ఘటనలు జరిగాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అధికారులు జైళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు అత్యంత భయానకంగా ఉన్నాయి. కొందరు ఖైదీల తలలు తెగిపోయి ఉన్నాయి. కొందరు ఖైదీల కాళ్లు తీసేశారు. కొందరి చేతుల్ని నరికేసినట్లు ఆ వీడియోల్లో ఉన్నది. దీంతో ఈక్వెడార్ ప్రిజన్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైవల్ గ్యాంగ్లు హింసాకాండ సృష్టించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. గుయాక్విల్ నగర ప్రిజన్ను సైనిక బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. పోర్ట్ నగరం మంటాలో ఉన్న జైలులో లాస్ చోనిరాస్ గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. డిటెన్షన్ సెంటర్లలో ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెంట్రల్ అమెరికాకు కొకైన్ సరఫరా చేసేందుకు ఆ దేశంలో గ్యాంగ్ వార్ కొనసాగుతోంది. కొలంబియా, పెరు దేశాల్లో ఉత్పత్తి అయ్యే కొకైన్ను సరఫరా చేసేందుకు ఈక్వెడార్లో డ్రగ్ కార్టెల్స్ పనిచేస్తుంటాయి.