Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air pollution) రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారి తీస్తోంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతీ ఇంట్లో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ (LocalCircles survey) నిర్వహించిన సర్వేలో కీలక విషయం వెల్లడైంది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 75 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు (ప్రతీ కుటుంబంలో) అనారోగ్యంతో ఉన్నారని తేలింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ నుంచి దాదాపు 15,000 కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. నాలుగు కుటుంబాలకు గానూ మూడు కుటుంబాల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, కళ్ల మంటలు, తలనొప్పితో ఇబ్బందిపడుతున్నారు.
గత నెల చివరిలో అంటే సెప్టెంబర్ చివరిలో దాదాపు 56 శాతం ఇండ్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలను నివేదించగా.. అక్టోబర్ చివరికి ఆ సంఖ్య 75 శాతానికి పెరిగింది. దాదాపు 17 శాతం కుటుంబాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు. 25 శాతం కుటుంబాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు అనారోగ్య సభ్యులు ఉన్నారు. 33 శాతం కుటుంబాల్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా.. 25 శాతం కుటుంబాలు మాత్రమే అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది.
రాజధాని అంతటా H3N2 ఫ్లూ (H3N2 influenza), ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల కేసుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోందని వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వారు కోలుకునేందుకు కూడా చాలా సమయం పడుతోందని వివరించారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు.
Also Read..
PM Modi | మన సత్తా ఏంటో ఉగ్రవాదులకు తెలిసింది : ప్రధాని మోదీ
NDA Manifesto | కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
Indians | ఈ ఏడాది 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం