న్యూఢిల్లీ : భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని మంత్రిత్వ శాఖను కోరారు. మహిళా అధికారుల తరఫు న్యాయవాది మేజర్ సుధాంశు పాండే మంత్రిత్వశాఖకు నోటీసు పంపారు. శాశ్వత కమిషన్ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరినట్లే పాండే తెలిపారు. 72 మంది మహిళా అధికారుల తరఫున నోటీసు పంపించినట్లు చెప్పారు. రక్షణ కార్యదర్శి, ఢిపెన్స్ స్టాఫ్ చీఫ్తో సహా అధికారులకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 25న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా శాశ్వత కమిషన్ అమలు కోరుతున్నామన్నారు. గతంలో సుప్రీం కోర్టు మహిళా అధికారులను బ్యాచ్లోని పురుష అధికారులకు నిర్ధేశించిన బెంచ్ మార్కులతో పోల్చరాదని రక్షణ మంత్రిత్వశాఖ, అధికారులకు స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో 60 శాతం మార్కులు సాధించి.. 5 మార్కులతో అనర్హులుగా తేలిన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ అమలు చేయాలని సెలక్షన్ బోర్డుకు కోర్టు సూచించింది. ఉత్తర్వులు అమలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు రెండు నెలల పాటు ఇచ్చింది.