న్యూఢిల్లీ : అస్సాంలో తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిసింది.
రాష్ట్రవ్యాప్తంగా 72.46 పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది. బోకాఖత్ జిల్లాలో అత్యధికంగా 80శాతం పోలింగ్ నమోదు కాగా.. నజియా జిల్లాలో 64 శాతం జరిగింది.
రూపోహాత్ నియోజకవర్గంలో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదుకాగా.. సూటి నియోజకవర్గంలో అత్యల్పంగా 64 శాతం నమోదైందని ఈసీ వెల్లడించింది.
అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ దిబ్రూగర్ జిల్లా జేపీ నగర్ నియోజవర్గ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా ఘోపూర్ జిల్లాలో ఓటు వేశారు.
అస్సాంలో 47 అసెంబ్లీ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగ్గా 264 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 81.09 లక్షల మంది ఓటర్లకుగాను 11,537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
126 స్థానాలున్న అస్సాం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఇవాళ పూర్తికాగా.. ఏప్రిల్ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడత పోలింగ్ జరగనుంది.
మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.