పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ జోరు
అమెజాన్, మైక్రోసాఫ్ట్ బాటలో ఎలెస్ట్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు నెలవుగా భాసిల్లుతున్న తెలంగాణ.. పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్న తెలంగాణకు గత రెండేండ్లలో కేవలం మూడు దిగ్గజ కంపెనీల నుంచే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడు లు రావడం ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజం రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) గ్రూప్ నుంచి ఈ పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 2.77 బిలియన్ డాలర్ల (రూ.20,761 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) 2020 నవంబర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్దదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆ తర్వాత అమెరికన్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం అమెజాన్ బాటలో నడిచి, తెలంగాణకు క్యూ కట్టింది. భారత్లో తమ అతిపెద్ద, నాలుగో డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. ఇందుకోసం 15 ఏండ్లలో రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇదే విధం గా ఇప్పుడు అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన ఫార్చ్యూన్-500 కంపెనీ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. టీవీలు,స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల తయారీకి ఉపయోగించే అత్యాధునిక అమోలెడ్ ప్యానళ్ల ఉత్పత్తి కోసం హైదరాబాద్లో డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద పెట్టుబడిగా రికార్డుకెక్కింది. ప్రత్యక్షంగానే దాదాపు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యూనిట్ను నెలకొల్పేందుకు ఎలెస్ట్ ఆదివారం బెంగళూరులో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. దీంతో రాష్ర్టానికి ఈ మూడు దిగ్గజ కంపెనీల నుంచే మొత్తం రూ. 59,761 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టయింది.