కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే కర్రల సమరంలో రక్తం చిందింది. ఆనవాయితీగా వస్తున్న బన్నీ ఉత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాలు ప్రజలు ఒక జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కర్రలతో తలపడ్డారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు.
బన్నీ ఉత్సవంలో హింస జరుగకుండా ఉండేలా పోలీసులు తీసుకున్న చర్యలు ఈ ఏడాదీ ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటుచేసిన రక్తం ఏరులైపారింది. కాగా ఈ ఉత్సవాన్ని సుమారు 2 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించారు.