నిజామాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లోని శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆరు రోజులపాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం సంపూర్ణమైంది. భక్తులు గర్భగుడిలో స్వామివారి తొలి దర్శనం చేసుకొని పులకించిపోయారు. ఆరో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి, పరివార దేవతా మూర్తుల సంప్రోక్షణ వేడుకగా సాగింది.
విమాన శిఖ రం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన ఉత్సవాలు కన్నులపండువగా సాగాయి. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ నిర్విఘ్నంగా ఐదు రోజులపాటు నరసింహ యాగ పూర్ణాహుతి నిర్వహించారు. నరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని బృం దం స్వామివారి తిరుకల్యాణాన్ని రమణీయంగా నిర్వహించింది. శ్రీలక్ష్మీనృసింహ మాలాధారణం, వేద ఆశీర్వచనాలతో భక్తులు తన్మయత్వం చెందారు. ఇక నుంచి స్వామివారు భక్తులకు మంగళ దర్శనం ఇస్తారని, ఏటా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, స్వామివారి జయంతి, ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవచ్చని భార్గవ నరసింహస్వామి తెలిపారు.
శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవాల చివరి రోజు ఆలయానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ, వారి బంధువులు హాజరయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి దంపతులు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తదితరులు హాజరయ్యా రు. కల్యాణ ఘట్టంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో దేవనపల్లి రాంకిషన్రావు-నవలత, కల్వకుంట్ల కవిత-అనిల్కుమార్, అరుణ్ కుమార్-ననిత దంపతులతోపాటు వారి కుటుంబ సభ్యులు వివిధ క్రతువుల్లో పాలుపంచుకొన్నారు. విశేష సేవలందించిన పండితులు, దేవాలయ నిర్మాణానికి భూదా నం చేసిన దాతలను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు.