దేశంలో 5జీ సర్వీసులు ప్రారంభం.. తొలుత కొన్ని మెట్రో నగరాల్లో అందుబాటులోకి
భారత టెక్నాలజీ రంగంలో కొత్త విప్లవం మొదలైంది.
దేశమంతటా అమలుకు రెండేండ్లు పట్టే అవకాశం
హైదరాబాద్లో ప్రారంభమైన ఎయిర్టెల్ 5జీ సేవలు
న్యూఢిల్లీ/ హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): భారత టెక్నాలజీ రంగంలో కొత్త విప్లవం మొదలైంది. దేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం న్యూఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఈ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. టెలికం రంగంలో గొప్ప మార్పులకు 5జీ శ్రీకారం చుట్టబోతున్నదని వెల్లడించారు. అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీ కోసం భారత్ విదేశాలపై ఆధారపడిందని, 5జీ టెక్నాలజీని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఇంతకుముందు 1 జీబీ డాటాకు రూ.300 చెల్లించేవారమని, ఇప్పుడు రూ.10కే వస్తుందని పేర్కొన్నారు.
టెలికం సంస్థలు ఏమంటున్నాయంటే..
ఎయిర్టెల్
శనివారమే 5జీ సేవ లను ప్రారంభించిన తొలి కంపెనీగా ఎయిర్టెల్ నిలిచింది. 2023 మార్చి నాటికి అన్ని నగరాల్లో, 2024 నాటికి దేశవ్యాప్తంగా 5జీని తీసుకొస్తామని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. 4జీ ధరలకే 5జీ సేవలు అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, కోల్కతా, సిలిగురిలో ఎయిర్టెల్ 5జీని అందుబాటులోకి తెచ్చింది.
జియో
2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను తీసుకొస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో అందుబాటులోకి తెస్తామన్నారు.
వొడాఫోన్ ఐడియా
ఎయిర్టెల్, జియో 5జీ సర్వీసులపై స్పష్టమైన ప్రకటన చేసినా, వొడాఫోన్ ఐడియా మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సంస్థ చైర్మన్ కుమారమంగళం బిర్లా మాట్లాడుతూ.. త్వరలోనే 5జీని అందుబాటులోకి తెస్తామని మాత్రమే చెప్పారు.
బీఎస్ఎన్ఎల్
ఆరు నెలల్లో 200 నగరాల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రెండేండ్లలో దేశంలోని 80-90 శాతం ప్రాంతాల్లో సేవలను అందిస్తామని వెల్లడించారు. తక్కువ ధరకే ఈ సేవలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఐవోటీకి కొత్త ఉత్తేజం
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కొన్నింటికే పరిమితమైంది. 5జీ రాకతో 2030 నాటికి 125 బిలియన్ పరికరాలు హైస్పీడ్ నెట్కు కనెక్టవుతాయని శాస్త్రవేత్తల అంచనా. ఎకడైనా కూర్చొ ని ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయొ చ్చు. నోటి మాటతో నిత్యావసర వస్తువులు డెలివరీ అయిపోతాయి. ఇంట్లోని వస్తువులన్నీ స్మార్ట్గా మారిపోతాయి.
బఫరింగ్ లేని స్ట్రీమింగ్
5జీతో బఫరింగ్ లేకుండా వీడియో లు చూడొచ్చు. వీడియో కాల్స్ మెరుగవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగుమెంటెడ్ రియాలిటీ రూపు మారిపోతుంది. ఆరోగ్య రంగం, విపత్తుల నిర్వహణ, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో గొప్ప పురోగతి కనిపిస్తుంది. మొబైల్ క్లౌడ్ గేమింగ్, మెటావర్స్ అనుభూతికి 5జీ దారి చూపిస్తుంది.
5జీ.. క్రేజీ
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి విడుతలో ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే సర్వీసులు ప్రారంభమయ్యాయి. అనంతరం విడతల వారీగా దేశమంతటా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం వాడుతున్న 4జీ సిమ్ను కొనసాగించొచ్చు. కాకపోతే.. 5జీ వాడాలంటే ఫోన్ 5జీ కంపాటబిలిటీ ఉండాలి. కానీ, 4జీ ఫోన్లతో 5జీని వినియోగించుకోవటం సాధ్యం కాదు. 4జీలోనే కొనసాగాలనుకొనేవారు.. ప్రస్తుత ఫోన్లనే వాడొచ్చు.
ఇతర ముఖ్యాంశాలు
ప్రపంచవ్యాప్తంగా 2022 జూన్ నాటికి 70 దేశాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
2025 నాటికి 5జీ కనెక్షన్లు 3.6 బిలియన్లకు, 2027 నాటికి ఆ సంఖ్య 4.4 బిలియన్లకు చేరుకొంటాయని అంచనా.
ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. 5జీ డౌన్లోడింగ్ స్పీడ్లో దక్షిణ కొరియా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో సగటున సెకనుకు 432.7 ఎంబీపీఎస్ వేగంతో ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.