న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కసరత్తు సాగిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి ఒక్కరికీ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ నెట్వర్క్ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.
అక్టోబర్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి అశ్వని వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5జీ స్ప్రెక్టం వేలాన్ని పూర్తి చేసి ఆ ప్రక్రియ ఆమోదం, స్పెక్ట్రం కేటాయింపులను చేపడుతోంది. భారత్లో 5జీ స్ప్రెక్టం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ 1.5 లక్షల కోట్లు సమకూరతాయని అంచనా. వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐతో పాటు అదానీ డేటా నెట్వర్క్ కూడా పాల్గొంది.
ఇక తొలి దశలో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానుండగా దశలవారీగా దేశమంతటా 5జీ నెట్వర్క్ విస్తరిస్తుంది. భారత్లో 4జీ ప్లాన్ల తరహాలోనే 5జీ ప్లాన్లు కూడా అందుబాటు ధరల్లో లభిస్తాయి. 5జీ విస్తరణకు ఊతమిచ్చేలా 4జీ సేవల టారిఫ్ ప్లాన్లనే 5జీకి టెలికాం ఆపరేటర్లు వర్తింపచేయవచ్చని భావిస్తున్నారు.