న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 5జీ స్పెక్ట్రం వేలం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను అమ్మకానికి పెడితే.. రూ.1.5 లక్షల కోట్లకే బిడ్లు పరిమితమయ్యాయి మరి. గత నెల 26న మొదలైన స్పెక్ట్రం వేలం.. సోమవారం ముగిసింది. మొత్తం గడిచిన ఈ 7 రోజుల్లో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ మేరకు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అయితే ఈ 7 రోజుల్లో తొలిరోజు రికార్డు స్థాయిలో ఆదరణ కనిపించినప్పటికీ.. మిగతా ఆరు రోజుల్లో రోజురోజుకూ బిడ్డింగ్ విలువ తగ్గుతూపోయింది. కాగా, నిరుడు 4జీ స్పెక్ట్రం వేలంలో రూ.77,815 కోట్ల బిడ్డింగ్ జరగగా, 2010లో చేపట్టిన 3జీ స్పెక్ట్రం వేలంలో రూ.50,968.37 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ రకంగా చూస్తే మాత్రం ఈసారి వేలంలో ఖజానాకు కాసులు పెరిగినట్టే అనుకోవచ్చు. ఈసారి వేలంలో నాలుగు సంస్థలు పాల్గొన్నాయి.
జియో దూకుడు
5జీ స్పెక్ట్రం వేలంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోనే టాప్ బిడ్డర్గా నిలిచింది. జియో బిడ్ల విలువ అత్యధికంగా రూ.88,078 కోట్లుగా ఉన్నది. ఇది ఈసారి అమ్ముడైన మొత్తం స్పెక్ట్రం విలువలో సగానికిపైగా ఉండటం విశేషం. మొత్తం 5 బ్యాండ్లలో జియో బిడ్డింగ్ వేయగా, ప్రస్తుత 4జీ కంటే సుమారు 10రెట్లు అధికంగా దీని వేగం ఉండనున్నది. ఇదిలావుంటే ఆశ్చర్యకరంగా 5జీ పోటీలో నిలిచిన అదానీ గ్రూప్.. కేవలం 400 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసమే దరఖాస్తు చేసుకున్నది. అమ్మకానికి పెట్టిన మొత్తం స్పెక్ట్రంలో ఒక్క శాతం కూడా ఉండదు. దీని విలువ రూ.212 కోట్లుగా ఉన్నట్టు మంత్రి వైష్ణవ్ తెలియజేశారు. అదానీ సంస్థ 26 గిగాహెట్జ్ బ్యాండ్లోని స్పెక్ట్రం కోసం బిడ్డింగ్ వేసింది. పబ్లిక్ టెలీ నెట్వర్క్స్కు ఇది పనికిరాకపోవడం గమనార్హం. ఇక బిడ్డింగ్ సరళినిబట్టి దేశవ్యాప్తంగా జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను అందించే వీలున్నది. వొడాఫోన్ ఐడియా మాత్రం ఎంపిక చేసుకున్న నగరాలకే పరిమితం కావచ్చనిపిస్తున్నది.
700 మెగాహెట్జ్కు డిమాండ్
ఈసారి వేలంలో 700 మెగాహెట్జ్ బ్యాండ్కు టెలికం సంస్థల నుంచి విపరీతంగా డిమాండ్ కనిపించింది. నిజానికి 2016, 2021ల్లో నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో ఈ శ్రేణి రేడియో తరంగాలను ఎవరూ కొనలేదు. అయితే ఇప్పుడు మాత్రం అమ్ముడైన మొత్తం స్పెక్ట్రంలో 25 శాతానికిపైగా వాటా 700 మెగాహెట్జ్దే. దేశంలోని మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 5జీ సేవల కోసం ఇది చక్కగా సరిపోతుంది. 700 మెగాహెట్జ్ శ్రేణి తరంగాలను వినియోగిస్తే సిగ్నల్ టవర్ కవరేజీ ఏరియా కూడా పెరుగుతుంది. అందుకే జియో సైతం పెద్దపీట వేసింది. ఎయిర్టెల్ మాత్రం దీనికి దరఖాస్తు చేసుకోలేదు.
అమ్మకానికి పెట్టిన బ్యాండ్లు ఇవే..
హైఫ్రీక్వెన్సీ బ్యాండ్ 26 గిగాహెట్జ్తోపాటు మధ్యశ్రేణి బ్యాండ్ 3300 మెగాహెట్జ్, లోఫ్రీక్వెన్సీ బ్యాండ్లు 600, 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ తరంగాలకు ఈసారి వేలంలో కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ల స్పెక్ట్రం అమ్మకానికి పెట్టారు.