కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప్పటి నుంచి మొబైల్ నెట్వర్క్స్ ఎన్నో మార్పులకు లోనై అధిక డేటా స్పీడ్తో ప్రస్తుతం ఫోర్త్ జనరేషన్ (4జీ) అందుతున్నాయి. కనెక్టివిటీ అవసరాలు పెరగడం, మొబైల్ డాటా ట్రాఫిక్ అధికంకావడంతో ఇప్పుడు తదుపరి తరం మొబైల్ నెట్వర్క్స్ అవసరమయ్యాయి. ఇదే 5జీ నెట్వర్క్. డాటా ట్రాన్స్ఫర్ లో ఏమాత్రం జాప్యం లేకుండా అధిక స్పీడ్తో డాటా అందించే నెట్వర్క్ ఇది. ఏ మాత్రం అవరోధాలు కలగకుండా ఒకే సమయంలో మరిన్ని కనెక్షన్లను ఇది నిర్వహించగలుగుతుంది. – న్యూఢిల్లీ, ఆగస్టు 8:
ఫిప్త్ జనరేషన్ సెల్యులర్ టెక్నాలజీయే 5జీ. గత జనరేషన్, ప్రస్తుత జనరేషన్ టెక్నాలజీలో ఎదురయ్యే స్పీడ్, లేటెన్సీ (డాటా బదిలీ ప్రారంభంలో జాప్యం), యుటిలిటీ తదితర సమస్యలు తలెత్తకుండా నెట్వర్క్ కనెక్షన్లను మెరుగుపర్చేలా 5జీ టెక్నాలజీని డిజైన్ చేశారు. 4జీ నెట్వర్క్స్తో పోలిస్తే 10 రెట్లు స్పీడ్తో డాటాను డెలివరీ చేసే కెపాసిటీ 5జీకి ఉంది. ప్రస్తుతం 50 మిల్లీసెకండ్ (ఎంఎస్) ఉన్న లేటెన్సీ 1 ఎంఎస్లోపునకు తగ్గిపోతుంది. అలాగే సెకను స్పీడ్లో 10 గిగాబైట్స్ వరకూ బదిలీ చేసేస్తుంది.
త్వరలోనే 5 జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇందుకు ఖచ్చితమైన తేదీని కంపెనీలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కంపెనీలు 5జీ నెట్వర్క్ ట్రయిల్స్ నిర్వహించి, సేవల్ని మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఆగస్టు నెలాకర్లో 5జీ సర్వీసుల్ని ప్రారంభిస్తామని భారతి ఎయిర్టెల్ ప్రకటించగా, ఏ తేదీ నుంచి సేవల్ని అందించేదీ ఆగస్టు 15న జియో వెల్లడించవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సర్వీసులు ప్రారంభంకానున్నాయి.
అవి..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్, కొల్కతా, చండీఘర్, జామ్నగర్, అహ్మదాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్. 1000 నగరాల్లో 5జీ కవరేజ్ ప్లానింగ్ పూర్తిచేశామని, 5జీ టెలికం గేర్స్ను క్షేత్రస్థాయిలో పరీక్షించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒక నెలరోజుల్లో 5జీ మొ బైల్ సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర టెలికం సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్ సోమవారం ఒక కార్యక్రమంలో ప్రకటించారు.
5జీ నెట్వర్క్ అమలుకు అవసరమైన స్పెక్ట్రం వేలం గతవారమే పూర్తయ్యింది. ఏడు రోజులపాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్డింగ్లో రూ.1.50 లక్షల కోట్ల స్పెక్ట్రం కోసం ఆయా కంపెనీలు బిడ్ చేశాయి. అత్యధిక 5జీ స్పెక్ట్రంను రిలయన్స్ జియో కొనుగోలు చేసింది.
మొత్తం స్పెక్ట్రం వేలంలో 50 శాతానికి రిలయన్సే బిడ్ చేసింది. 700 మెగాహెట్జ్, 800 మెగాహెట్జ్జ్, 1800 మెగాహెట్జ్జ్, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్లలో రూ. 88,078 కోట్ల విలువైన స్పెక్ట్రంను జియో చేజిక్కించుకుంది. ఇక రెండో పెద్ద టెలికం కంపెనీ అయిన భారతి ఎయిర్టెల్ 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2100 మెగాహెట్జ్జ్, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్లలో మొత్తం 19.8 గిగాహెట్జ్ స్పెక్ట్రంను రూ. 43,084 కోట్లకు తీసుకుంది.
వొడాఫోన్ ఐడియా 1800 మెగాహెట్జ్జ్, 2100 మెగాహెట్జ్, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్లలో బిడ్ చేసి, రూ. 18,799 కోట్ల విలువైన 6,228మెగాహెట్జ్ల ఎయిర్వేవ్స్ను సొంతం చేసుకుంది. వేలంలో పాల్గొన్న నాల్గవ కంపెనీ అదానీ డాటా నెట్వర్క్స్ కేవలం 26 గిగాహెట్జ్ బాండ్లో రూ. 212 కోట్ల విలువైన స్పెక్ట్రంను తీసుకుంది.
4జీ కంటే 5జీ సర్వీసులకు కంపెనీలు అధిక టారీఫ్లను వసూలు చేస్తాయన్న భావన ఎంతోమంది వినియోగదారుల్లో ఉంది. వాస్తవానికి 4జీ సర్వీసుల్లో ఇచ్చే డాటాకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో, అందుకు సమానంగానే 5జీ టారీఫ్లు కూడా ఉంటాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే 5జీ సేవల్ని ఉపయోగించుకోవాలంటే ఎక్కువ డాటా ఉండే ప్లాన్లను వినియోగారులు ఎంచుకోవాల్సి ఉంటుం ది. అందుకు అనుగుణంగా అధిక డాటా ప్లాన్లను ఎక్కువ టారీఫ్లతో కంపెనీలు ఆఫర్ చేసే అవకాశం ఉంది.
దీంతో కంపెనీల ఏపీఆర్యూ (ఒక్కో యూజర్ నుంచి అందే సగటు రెవిన్యూ) రూ.50 నుంచి రూ. 225-250 వరకూ పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం అందిస్తున్న 4జీ సేవల కోసం అందిస్తున్న టారీఫ్లకంటే 5జీ ప్లాన్స్ ఖరీదు 30% అధికంగా ఉండవచ్చని వొడాఫోన్ సీఈవో సూచనాప్రాయంగా తెలిపారు. ఈ సేవల్ని ప్రారంభించే సమయంలో పోటీకి అనుగుణంగా ఆయా కంపెనీలు డాటా ప్లాన్స్ను వెల్లడించవచ్చు.