అమరావతి : అరెటి గెలల మధ్య గంజాయి సరఫరా చేస్తున్న వ్యాన్ను తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి గ్రామ శివారులో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా అరటిగెలల లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ను పోలీసులు ఆపగా డ్రైవర్ వ్యాన్ దిగి పారిపోయాడు. వ్యాన్ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా గెలల మధ్య 23 బస్తాల్లో రహస్యంగా ఉన్న గంజాయిని గమనించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ సూరిఅప్పారావు వివరాలను వెల్లడించారు. డ్రైవర్ ఇసుక ర్యాంపు వద్ద వదిలి పరార య్యాడన్నారు. వ్యాన్ను తనిఖీ చేయగా అరటిగెలల లోడులో 23 బస్తాలతో 552 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీని విలువ సుమారు రూ.16.56 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 4500 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు.