కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా భవానీపూర్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో భారీగా బలగాలను భద్రత కల్పించనున్నది. ఉప ఎన్నికల కోసం 52 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లోనే 19 కంపెనీల కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత కల్పించాలని నిర్ణయించింది. మిగతా 33 కంపెనీల బలగాలను ముర్షిదాబాద్ జిల్లాలోని జాంగిపూర్, సంసర్గంజ్లో మోహరించనున్నారు. ఇప్పటికే 15 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్కు చేరుకున్నాయి. ఎనిమిది కంపెనీలు భవానీపూర్లో ఎన్నికల ముందే చేరుకున్నాయి. మిగతా ఏడు కంపెనీలను ముర్షిదాబాద్ జిల్లాకు తరలించారు. కేంద్ర బలగాల్లో ఏడు సీఆర్పీఎఫ్, నాలుగు బీఎస్ఎఫ్, రెండు ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీకి చెందిన ఒక్కో కంపెనీ బలగాలున్నాయి. మూడు స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనుండగా.. అక్టోబర్ 3న ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.