న్యూఢిల్లీ: Freshworks.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సంస్థ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఈ కంపెనీలో పని చేస్తున్న 500 మంది ఉద్యోగులూ ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నాస్డాక్ లిస్టింగ్లో ఫ్రెష్వర్క్స్
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్లో లిస్ట్ అయిన తొలి భారతీయ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ స్టార్టప్ కంపెనీగా ఫ్రెష్వర్క్స్ నిలిచింది. దీంతో ఈ సంస్థలోని 10 శాతం ఉద్యోగులు అంటే 500 మంది రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు. 2010లో కేవలం ఆరుగురు ఉద్యోగులతో చెన్నైలో ప్రారంభమైన ఈ సంస్థ.. ఇప్పుడీ స్థాయికి చేరడం విశేషం. గురువారం ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1300 కోట్ల డాలర్లు దాటింది. దీంతో ఈ సంస్థ తరఫున ఇండియాలో పని చేస్తున్న 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులైపోయారు. వీళ్లలో 70 శాతం మంది 30 ఏళ్లలోపు వాళ్లే. తొలిసారి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వెళ్లిన ఫ్రెష్వర్క్స్ షేరు ధర ఊహించినదాని కంటే ఎక్కువ విలువ పలికింది.
దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) కింద సంస్థ షేర్లు కలిగిన ఉద్యోగులు భారీగా లాభపడినట్లు ఫ్రెష్వర్క్స్ కోఫౌండర్, సీఈవో గిరీష్ మాతృబూతమ్ చెప్పారు. వచ్చిన సంపదను వ్యవస్థాపకులే తీసుకోకుండా, దానిని సృష్టించడంలో భాగమైన అందరికీ పంచాలన్నదే తన సిద్ధాంతమని ఆయన అన్నారు. బుధవారం ఇష్యూ ప్రైస్ కంటే 32 శాతం అధికంగా 47.55 డాలర్ల దగ్గర ఫ్రెష్వర్క్స్ షేర్లు ట్రేడవుతున్నాయి.
శిఖరాన్ని అందుకున్నాం.. ఆకాశాన్ని తాకుతాం..
సంస్థ సీఈవో గిరీష్… సూపర్స్టార్ రజనీకాంత్కు వీరాభిమాని. రజనీ కొత్త సినిమా రిలీజైనప్పుడల్లా ఉద్యోగులకు సెలవు ఇస్తుంది ఈ సంస్థ. అందుకే తమ సంస్థ ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత అదే రజనీకాంత్ మూవీ నరసింహలోని ఓ పాటనే తనకు ప్రేరణ అని గిరీష్ చెప్పారు. సింహం నడిచే దారిలో వెళ్లు.. శిఖరాన్ని తాకు.. అక్కడితో ఆగకుండా ఆకాశాన్ని కూడా అందుకో అన్న ఆ పాటలోని పదాలే తనకు ప్రేరణగా నిలిచాయని ఆయన అన్నారు. ఇప్పుడు శిఖరాన్ని తాకాం.. ఇంతటితో ఆగకుండా ఆకాశాన్నీ అందుకుంటామని విశ్వాసంతో చెబుతున్నారు.