ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు. కానీ.. జియో, స్మార్ట్ఫోన్లు.. ఈ రెండూ దేశ టెక్నాలజీ వ్యవస్థనే పూర్తిగా మార్చేశాయి. అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ఫోన్ ఉంటోంది. ఇంటర్నెట్ అంటే కూడా అందరికీ అవగాహన ఉంది.
ఉత్తరప్రదేశ్లోని రఖ్వా అనే గ్రామం కూడా అదే కోవకు చెందిన ఊరు. వెనుకబడిన ప్రాంతం అది. అక్కడి మౌలిక వసతుల లేమి వల్ల.. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల ఇప్పటికీ అక్కడి ప్రజలు వెనుకబడే ఉన్నారు. కానీ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. అధునాతనమైన సాంకేతికతను అందిపుచ్చుకొని కొందరు తమ జీవితాలను మార్చేసుకుంటున్నారు. అందులో ఒకరు 50 ఏళ్ల శశికల చౌరాసియా. తన ఇప్పుడు అక్కడ ఒక ఉదాహరణగా నిలిచింది.
ఇంటర్నెట్ అంటే తెలియని తను.. ఇప్పుడు ఒక యూట్యూబ్ చానెల్కు ఓనర్. అంతే కాదు.. తన యూట్యూబ్ చానెల్కు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ తను ఒక సెలబ్రిటీ. యూట్యూబ్ ద్వారా తను నెలకు రూ.70 వేలు సంపాదిస్తోంది.
అది కేవలం తన పిల్లల వల్లే సాధ్యం అయింది. తన కొడుకులు చందన్, సూరజ్, పంకజ్.. ఈ ముగ్గురు తన తల్లి వంటలు బాగా చేస్తుంది కాబట్టి తనతో ఒక యూట్యూబ్ చానెల్ పెట్టించాలనుకున్నారు. ఆ ఐడియాను తనకు చెప్పారు. కానీ.. తనకు అప్పుడు ఇంటర్నెట్ అంటేనే తెలియదు. కానీ.. తన కొడుకుల ప్రోత్సాహంతో తను కూడా ముందడుగు వేసింది.
అమ్మ కి తాలి అనే యూట్యూబ్ చానెల్ను చందన్ క్రియేట్ చేశాడు. అలా.. నవంబర్ 1, 2017న మొదటి వీడియోను అప్లోడ్ చేశారు. బూందీ ఖీర్ను తన తల్లి తయారు చేయగా.. తన కొడుకు చందన్ షూట్ చేసి.. అప్లోడ్ చేశాడు. కానీ.. ఆ వీడియోకు పెద్దగా వ్యూస్ రాలేదు.
అయినప్పటికీ.. తన తల్లిని చెఫ్గా మార్చేశారు. రోజూ వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్లిపోయారు. 2018లో మామిడికాయ పచ్చడి చేసే విధానానికి సంబంధించిన వీడియోకు వ్యూస్ బాగా వచ్చాయి. అప్పటి నుంచి ఇక శశికల వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు తన యూట్యూబ్ చానెల్కు 1.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు యూట్యూబ్ నుంచి రూ.70 వేల ఆదాయం వస్తుంది.