Mukesh Ambani @ London | ఆసియా కుబేరుడు.. భారత్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఆయన ఫ్యామిలీ దేశాన్నివీడుతున్నారా.. అందుకోసమే లండన్లోని స్టోక్ పార్క్ ఎస్టేట్ను ఇటీవల ఆయన కొనుగోలు చేశారని వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి, షాక్కు గురిచేశాయి. అంతే కాదు.. కొత్తింట్లోనే అంబానీలు దీపావళి పండుగ జరుపుకున్నారని వార్త వచ్చింది. ముంబై, లండన్ల్లోని ఇండ్లలో జీవనం సాగించడానికి అంబానీలు టైం డివిజన్ చేసుకుంటారని సమాచారం.
ఈ వార్తపై నెటిజన్లు ట్వీట్లతో హోరెత్తించడంతో తమ చైర్మన్ గానీ, ఆయన కుటుంబం గానీ భారత్ నుంచి లండన్కు వెళ్లిపోతుందని వచ్చిన వార్తలు నిరాధారం అని రిలయన్స్ ప్రకటన రిలీజ్చేసింది. అవన్న్నీ వట్టి వదంతులని కొట్టి పారేసింది. లండన్కే కాదు ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతానికి తరలి వెళ్లరని వివరణ ఇచ్చింది. ఇటీవలే 100 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపద గల కుబేరుల క్లబ్లో చేరిన రిలయన్స్ అధినేత.. ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుడిగా మారాలంటే భారత్ను వీడాల్సిందేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అంబానీ కుటుంబం భారత్ను వీడుతుందని చెప్పడానికి కొన్ని బలమైన విశ్వసనీయ కారణాలు కనిపిస్తున్నాయి.
వాటిలో ఒకటి ఇటీవల అంబానీ ఇంటి వద్ద బాంబు దాడియత్నం.. విదేశీ ఆస్తులపై యావత్ అంబానీ కుటుంబానికి ఆదాయం పన్నుశాఖ (ఐటీ) నోటీసులు.. అంబానీలపై రాజకీయ దాడులు.. ప్రత్యేకించి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), సోనియాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీల నుంచి ఆరోపణలు.. భారత్లోని అత్యంత సంపన్నులు దేశం వీడుతున్నారన్న అధ్యయన నివేదిక.. భారతీయులు సహజంగా సొంతింట్లోనే దీపావళి జరుపుకుంటారు. అంబానీ కుటుంబం ఈ ఏడాది లండన్లోని కొత్తింట్లో దీపావళి జరుపుకున్నారన్న వార్త దీనికి బలం చేకూరుస్తున్నది.
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లు అంటిల్లియా ముందు నిలిపిన ఓ కారులో 20 ఎక్స్ప్లోజివ్ జిలెటిన్ స్టిక్స్తో కూడిన బాంబు, బెదిరింపు లేఖ దొరికాయి. ఠాణె వ్యాపారవేత్త మాన్సుఖ్ హిరేన్ది ఈ కారు అని తేలింది. తర్వాత వారం రోజులకు మాన్సుక్ హిరేన్ మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ.. ముంబై ఫేమస్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజెను అరెస్ట్ చేయడం దేశవ్యాప్త ప్రకంపనలకు దారి తీసింది. ఈ బాంబు దాడి యత్నానికి సచిన్ వాజె సూత్రధారి అని ఆరోపణలు ఉన్నారు. మరో గమ్మత్తైన విషయమేటంటే ఆయన అరెస్ట్ కావడానికి ముందు ఈ కేసు దర్యాప్తు అధికారి వాజెనే.
ఇక అంబానీకి విదేశాల్లో గల ఆస్తులపై ఆదాయం పన్నుశాఖ (ఐటీ).. ముకేశ్ అంబానీ దంపతులు, ముగ్గురు పిల్లలకూ నోటీసులు జారీ చేసింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు అనే పేరిట బ్లాక్మనీ యాక్ట్ కింద 2019 మార్చి 28న ఆ నోటీసులు ఇచ్చిందని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. ఈ అభియోగాలను రిలయన్స్ నిరాకరించింది. 2011లోనూ ఇదే విషయమై సదరు న్యూస్పేపర్ వార్తలు రాసిందని గుర్తు చేసింది. ముకేశ్ అంబానీతోపాటు పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలకు వెల్లడించని విదేశీ ఖాతాలు ఉన్నాయని విదేశీ ఖాతాలు ఉండటం చట్టవిరుద్ధమేమీ కాదని రిలయన్స్ పేర్కొంది. తమ బ్యాంకులో ఖాతాదారుల వివరాలు వెల్లడించిన హెచ్ఎస్బీసీ కూడా విదేశాల్లో ఉన్న వ్యాపారవేత్తల ఆస్తుల వివరాలను బయటపెట్టలేదని గుర్తు చేసింది.
2014 నుంచి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్పార్టీల నుంచి అంబానీ కుటుంబం విమర్శలు ఎదుర్కొంటున్నది. అదే ఏడాది ముకేశ్ అంబానీకి, యూపీఏ హయాంలో పెట్రోలియం మంత్రిగా ఉన్న వీరప్పమొయిలీలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ యాంటీ కరప్షన్వింగ్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో రిలయన్స్ ఉత్పత్తి చేసిన సహజవాయువు ధర రెట్టింపు చేసి, ఆ సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చారని అభియోగం.
2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ.. ప్రతి పాలసీని అంబానీ, అదానీ, ఇతర వ్యాపార, పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా చేపట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. నాలుగేండ్ల పాటు కార్పొరేట్ టాక్స్ తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇది సూట్బూట్కీ సర్కార్ అని మోదీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇలా తరుచుగా ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలకు.. అంబానీ కేంద్ర బిందువు కావడం ఆందోళన కలిగించే అంశం.
2020లో దేశంలోని అత్యంత సంపన్ను (హెచ్ఎన్ఐస్) ల్లో రెండు శాతం.. సుమారు ఐదువేల మంది మిలియనీర్లు విదేశాలకు వెళ్లారని ఇటీవల గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక తెలిపింది. వివిధ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లిన సంపన్నుల జాబితాలో గతేడాది రెండోస్థానంలో.. ఈ ఏడాది టాప్లో నిలిచింది.
భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. సంపన్న దేశాల్లో నివాసం ఉండాలంటే ఇండియన్ పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. ఈ తరుణంలో దేశభక్తిపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరుచుగా విదేశీ పర్యటనలకు వెళ్లే వారిలో దేశభక్తి తక్కువ అని విపక్షం ఆరోపణలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విదేశీయతపై అధికార బీజేపీ నేతలు తరుచుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సొంతిండ్లలోనే లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తూ.. భారతీయ హిందూ వ్యాపారవేత్తలు సాధారణంగా సొంతిండ్లలోనే దీపావళి జరుపుకుంటారు. ఒకటికంటే ఎక్కువ ఇండ్లు ఉన్నవారు ప్రాథమిక ఫ్యామిలీ రెసిడెన్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. లండన్లో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లోఅంబానీ కుటుంబం దీపావళి పండుగ జరుపుకున్నారని వార్తలొచ్చాయి. దీన్నిబట్టి అంబానీలు లండన్ను శాశ్వత నివాసంగా మార్చుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిలో ఎన్నిరోజులు.. ఎంతకాలం లండన్లో..భారత్లో ఉంటారో మున్ముందు తేలుతుందని పేర్కొంటున్నారు.