లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయ్..
కేంద్రం తీరుపై మండిపడ్డ వరుణ్గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ కేంద్రంలోని సొంతపార్టీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు కట్టబెడుతుండడంపై మండిపడ్డారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, సుమారు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని, లక్షల కుటుంబాల్లో కల్లోలం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ అసమానతలను పెంచదని పేర్కొన్నారు. 13 లక్షల పైచిలుకు సిబ్బందితో భారత రైల్వే వ్యవస్థ ప్రపంచ దిగ్గజాల్లో ఒకటిగా నిలిచిందని, ప్రభుత్వం పనిగట్టుకొని బ్యాంకులను, రైల్వేలను ప్రైవేటుపరం చేయడం భావ్యం కాదన్నారు.