హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153కు పెరిగింది. కొత్తగా 710 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,27,964 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో నలుగురు బాధితులు ప్రాణాలు వదలగా.. మొత్తం మృతుల సంఖ్య 3,784కు పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.59శాతం, రికవరీ రేటు 97.94శాతంగా ఉందని చెప్పింది. ఇవాళ ఒకే రోజు 91,457 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76, కరీంనగర్లో 49, వరంగల్ అర్బన్లో 43, ఖమ్మంలో 40, రంగారెడ్డిలో 31, పెద్దపల్లిలో 30 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.