జీహెచ్ఎంసీలోనే 138 మందికి పాజిటివ్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. బుధవారం 56,564 నమూనాలను పరీక్షించగా, 493 మందికి పాజిటివ్గా తేలినట్టు గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 138 మందికి వైరస్ సోకింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డిలో 35, సంగారెడ్డి, నిజామాబాద్లో 24 చొప్పున, మహబూబ్నగర్లో 19, కరీంనగర్, నల్లగొండలో 18 చొప్పున, నిర్మల్లో 16, మంచిర్యాలలో 14, వరంగల్ అర్బన్లో 12 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం 35,196 నమూనాలను పరీక్షించగా, 758 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
32 వేల మందికి వ్యాక్సిన్
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 32,350 మంది తొలిడోస్ తీసుకున్నారు. 2,151 మంది రెండోడోస్ వేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 8.18 లక్షలకు చేరగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2.26 లక్షలకు చేరింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా కేవలం 0.80 శాతం మాత్రమే ఉన్నదని, దేశంలోనే ఇది అత్యల్పమని గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ వివరించింది.
మాస్క్లేని 12 మందికి జరిమానా
మెదక్ జిల్లా రామాయంపేటలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 12 మందికి జరిమానా విధించారు. గురువారం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పట్టణంలో పర్యటించి మాస్కులు లేకుండా తిరుగుతున్నవారిని గుర్తించి రూ.100 చొప్పున జరిమానా విధించారు. మరోసారి మాస్క్ లేకుండా తిరిగితే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.