లక్నో : కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సరిపడా వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత కారణంగా 41 ఆస్పత్రులను మూసివేశారు. ప్రస్తుతం 25 ఆస్పత్రుల్లో మాత్రమే టీకా ప్రక్రియ కొనసాగుతోంది. వారణాసి జిల్లాకు సరఫరా చేసే సెంటర్ను కూడా మూసివేశారు. టీకాల కొరతపై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
టీకా సరఫరా కేంద్రంలో పని చేసే హెల్త్ వర్కర్ శ్యామ్ జీ ప్రసాద్ మాట్లాడుతూ.. లక్నో నుంచి సరఫరా అవుతున్న టీకా క్రమంగా జిల్లాలకు తగ్గించేశారు. కానీ వారణాసిలో కొవిడ్ టీకాకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఇప్పుడు టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. టీకా కొరతపై ఇప్పటికే నోడల్ అధికారికి సమాచారం అందించామని తెలిపారు. వారణాసితో పాటు మహారాష్ర్ట, ఒడిశాలోనూ వ్యాక్సిన్ కొరత ఉంది.