మహబూబ్ నగర్/ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది.
దీనికి తోడు కర్ణాటకలోని కృష్ణానదీ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు నదిలో కలుస్తోంది. గంట గంటకు కృష్ణమ్మ ప్రవాహం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 41 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1.55 లక్ష క్యూసెక్కులు, కాగా ఔట్ ఫ్లో 1,69 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగాను ప్రస్తుతం 318.160 మీటర్లు నమోదైంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.