వడోదర: గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలోని సావ్లీ పట్టణంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఓ మతానికి సంబంధించిన కొందరు వ్యక్తులు తమ పండుగ నేపథ్యంలో సావ్లీలోని కూరగాయల మార్కెట్లోగల కరెంటు స్తంభానికి తమ జెండాను కట్టారు. ఆ కరెంట్ స్తంభం పక్కనే ఆలయం ఉంది. దాంతో మరో మతానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని గొడవకు దిగారు.
ఆలయానికి సమీపంలో జెండాను కట్టడం ద్వారా తమ మతపరమైన సెంటిమెంటును దెబ్బతీశారంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని రెండు వర్గాల వారిని చెదరగొట్టారు.
ఘటనలో గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాల నుంచి మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడం కోసం సావ్లీ పట్టణం అంతటా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.