ఉద్యోగులపై మరోసారి అపార ప్రేమ చూపిన సీఎం కేసీఆర్
పీఆర్సీ 7.5 శాతం సూచిస్తే 30 శాతం ఫిట్మెంట్ ప్రకటన
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగఫ్రెండ్లీ అని మరోసారి నిరూపించుకొన్నది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసినదానికంటే ఉద్యోగులకు నాలుగురెట్లు ఫిట్మెంట్ ప్రకటించింది. కరోనా కష్టకాలంలో కూడా 30శాతం ఫిట్మెంట్ ఇచ్చి సీఎం కేసీఆర్ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో 2018 మే 18న ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసింది. 31 నెలలపాటు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరం 278 పేజీల నివేదికను 2020 డిసెంబర్ 31న ప్రభుత్వానికి కమిషన్ అందజేసింది. ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది. ఈ నివేదికపై మరోసారి ఉద్యోగులతో చర్చించేందుకు సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారు.
ఈ కమిటీ నివేదిక అందించిన తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో పలుసార్లు సమావేశమయ్యారు. అనంతరం 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్టు అసెం బ్లీలో ప్రకటించారు. ఫిట్మెంట్ 7.5 శా తం ఇవ్వాలంటూ పీఆర్సీ సిఫారసు చేయటంపై ఉద్యోగులు మొదట తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినప్పటికీ సీఎం కేసీఆర్ తమకు తగిన న్యాయం చేస్తారన్న నమ్మకం ఉం చారు. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెడుతూ పీఆర్సీ సిఫారసులకు సీఎం కేసీఆర్ నాలుగురెట్లు ఫిట్మెంట్ ప్రకటించారు. ప్రభు త్వ ఉద్యోగులతోపాటు ఇతర అన్నిరకాల ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 9,17,797 మంది తెలంగాణ తొలి పీఆర్సీ ద్వారా లబ్ధి పొందనున్నారు.