న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ ఏడాది జూలై 1 నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని, ఉద్యోగుల మూల వేతనంలో డీఏ 38 శాతానికి పెరుగుతుందని వివరించారు. 41.85 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం అమలుకు ప్రభుత్వం ఏటా రూ.12,852.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు.
పీఎంజీకేఏవై పొడిగింపు..
కొవిడ్ సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ అందించేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) అమలు గడువును కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందజేస్తున్నారు.
రూ.10 వేల కోట్లతో..
న్యూఢిల్లీ, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లతోపాటు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) రైల్వే స్టేషన్ను రూ.10 వేల కోట్లతో రీడెవలప్ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమో దం తెలిపింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను మూడున్నర ఏండ్లలోగా.. అహ్మదాబాద్, సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్లను రెండున్నర ఏండ్లలోగా రీడెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు వివరించారు.