ఈ ఏడాది భారీ విస్తీర్ణంలో సాగు
త్వరలో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్,రీసెర్చ్ వింగ్: మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్రంలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని అంచనాలున్నట్టు ఆ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఆరున్నరేండ్లలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు. ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే 55 శాతం తీసుకోవడం ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. భారీ విస్తీర్ణంలో పంటలు పండుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించామని, ఇందులో నుంచి ముందస్తుగా మార్కెటింగ్శాఖకు రూ.6.5 కోట్లు విడుదలచేసినట్టు వివరించారు. ఇందుకోసం ఇటీవలే ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థను ఎంపికచేసినట్టు చెప్పారు. ఈ సంస్థ దేశవిదేశాల్లోని మార్కెట్ పరిణామాలను పరిశీలించి రైతులకు మంచి ధర లభించేలా సూచనలు, సలహాలు అందజేస్తుందని పేర్కొన్నారు.