కైరో: ఈజిప్టు అంటే ప్రాచీన నాగరికత. ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశ ప్రత్యేకత. అయితే తాజాగా ఓ నగరమే బయటపడింది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతంలో ఈ నగరం ఉన్నట్టు ఈజిప్టు పురావస్తుశాఖ తెలిపింది. లక్షర్ సమీపంలో వెలుగు చూసిన ఈ నగరాన్ని ప్రస్తుతానికి రైజ్ ఆఫ్ ఆతెన్ గా పిలుస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచో ఈ నగరం కోసం అన్వేషణ సాగుతోంది. కాలగర్భంలో కలిసిపోయిన ఈ నగరం మూడవ అమెన్హోతెప్ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.
టుటాన్ఖామెన్ సమాధి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పురావస్తు విశేషంగా దీని గురించి చెప్పుకుంటున్నారు. కరోనా కల్లోలానంతర కాలంలో టూరిజం రంగం మరోసారి పుంజుకోవాలని ఆశిస్తున్న ఈజిప్టుకు ఈ నగరం ఓ వరప్రసాదంలా మారుతుందని అంటున్నారు.
ఈజిప్టు సామ్రాజ్యం సంపదతో తులతూగుతున్న కాలానికి చెందిన ఈ నగరం ఆనాటి ప్రజల జీవనశైలిని పట్టిస్తుందని ఆశిస్తున్నారు. 22 రాజకుటుంబాలకు మమ్మీలను కొత్త మ్యూజియంలోకి మార్చిన నేపథ్యంలో ఈ నగరం వెలుగు చూడడం శుభపరిణామం అని ఈజిప్టు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ ఈజిప్షియన్ పురావస్తు శాస్త్రవేత్త జాహీ హవస్ నేతృత్వంలో 2020 సెప్టెంబర్ లో ఈ నగరం కోసం తవ్వకాలు మొదలయ్యాయి. గోడలు, వంటశాలలు, సమాధులు, పనిముట్లు ఉంగరాలు, రంగులు వేసిన కుండలు ఇలా ఎన్నో వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా దొరికాయి. ఇటుకలపై చక్రవర్తి మూడవ అమెన్హోతెప్ రాజముద్రలు ఉన్నాయి. వాటిని బట్టే 3 వేల ఏళ్ల పైచిలుకు నాటి నగరమని కాలనిర్ణయం చేశారు. చక్రవర్తి సింహాసన వారసుడు అఖేనాతెన్, అతని తల్లి నెపర్తీతీ రాజధానిని ఇక్కడ నుంచి అమర్నాకు మార్చడం వెనుక గలకారణాలు ఈ తవ్వకాల ద్వారా తెలుస్తాయని అంటున్నారు.