భోపాల్, జూలై 28: మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేయడం కలకలం సృష్టించింది. సాగర్ నగరంలో జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటుచేశారు. శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ వచ్చాడు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చిన 15ఏండ్ల పైబడిన 39 మందికి ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. వీరంతా 9 నుంచి 12 తరగతులకు చెందినవారే. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అధికారులు తనకు ఒకటే సిరంజీ పంపించారని, తన తప్పేమీ లేదని చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా వైరల్గా మారిన ఈ ఘటనపై.. ఇన్చార్జి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వ్యాక్సినేటర్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.