చెన్నై: కాలుష్యాన్ని వెదజల్లుతున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ మూసివేతను డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనకు సంబంధించి దాఖలు చేసిన 38 కేసులను ఎత్తివేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆ నివేదికలో పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచించారా లేదా అనేది తెలియరాలేదు. 2018లో తూత్తుకుడి లోని స్టెరిలైట్ యూనిట్కు వ్యతిరేకంగా ఉధృతమైన ఆందోళన సాగింది. వేదాంత రిసోర్సెస్ యాజమాన్యంలోని స్టెరిలైట్ తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తున్నట్టు తేలింది. దాంతో కాలుష్యానికి కారణమైన స్మెల్టర్ను మూసివేయాలని ఆందోళకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం పొందేవారిలో వైగో, నల్లకణ్ణు, టీటీవీ దినకరన్, ప్రేమలతా విజయకాంత్ తదితరులు ఉన్నారు. దీంతో మొత్తం 93 మంది కేసుల నుంచి విముక్తి పొందారు. భారతదేశంలో దశాబ్దకాలంలో కనివిని ఎరుగని స్థాయిలో సాగిన స్టెరిలైట్ పోరాటం సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది అమరులయ్యారు. పోలీసుల జులుంను, బలప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ కూడా తీవ్రంగా దుయ్యబట్టింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆక్సిజన్ తయారీకి స్టెరిలైట్ యూనిట్ను తిరిగి ఉపయోగంలోకి తెచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా యూనిట్ పని ప్రారంభించింది. నాలుగు మాసాల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే కొనసాగుతుందని, రాగి తయారీ, ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.