న్యూఢిల్లీ, జూన్ 17: అడ్వాన్స్ పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ మధ్యకాలం నాటికి రూ.1.01 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూలైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.75,783 కోట్లతో పోలిస్తే 33 శాతం అధికం. వీటిలో కార్పొరేట్ సంస్థలు రూ.78,842 కోట్ల మేర పన్ను చెల్లింపులు జరపగా, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించేవారు రూ.22,175 కోట్లు చెల్లించారు. మొత్తంగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు ఏడాది ప్రాతిపదికన 45 శాతం పెరిగి రూ.3,39,225 కోట్లకు చేరుకున్నాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. అంతక్రితం ఏడాది రూ.2,33,651 కోట్లు వసూలయ్యాయి.