రాష్ట్రంలో 14,695 నర్సరీల్లో సిద్ధం
8వ విడతతో 19.54 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో సుమారు 32.99 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఉపాధి హామీ, అటవీశాఖ ద్వారా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. మొక్కల కొనుగోలుకు స్వస్తి పలికారు.
ఏ మున్సిపాలిటీల్లో ఏ మేరకు మొక్కలు అవసరం, ఎలాంటివి నాటేందుకు ఇష్టపడుతున్నారో ఆ మొక్కలే నర్సరీల్లో పెంచుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు వచ్చే అభివృద్ధి నిధుల్లో 10 శాతం హరితహారానికి ఖర్చు చేస్తున్నారు. ఈసారి హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.