30% ఫిట్మెంట్, పదవీ విరమణ వయసు పెంపుపై ఉద్యోగుల హర్షం
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ మేలు కోరి పనిచేస్తున్న రాష్ట్ర సర్కారుకు రుణపడి ఉంటామని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించడంపై సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పవన్కుమార్, కూరాకుల శ్రీనివాస్, లింగమూర్తి, రోషన్, మల్లికార్జునగౌడ్, దర్శన్గౌడ్, ఉపేందర్ మంగళవారం మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, రాష్ట్ర ఐకేపీ, వీవోఏ సంఘాల ప్రతినిధులు తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెస రు అరుణాదేవి, రాష్ట్రనేత కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
టీఎన్జీవో, టీజీవో కృతజ్ఞతలు
మంత్రి శ్రీనివాస్గౌడ్కు టీఎన్జీవో, టీజీవో, పలు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో శ్రీనివాస్గౌడ్ను శాలువాలతో సన్మానించారు. మంత్రిని కలిసినవారిలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఏ చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్నాయక్, ఉద్యోగ సంఘాల నేతలు అబ్దుల్ఖాదర్, రవీందర్, గోపాలకృష్ణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఫిట్మెంట్పై హర్షం వ్యక్తంచేస్తూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ నేతృత్వంలో ఉద్యోగులు మంత్రి హరీశ్రావును, సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్ను వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో సంఘం కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండల్రెడ్డి ఉన్నారు.
ఢిల్లీలోని తెలంగాణభవన్లో సంబురాలు
పీఆర్సీ ప్రకటనపై ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్లోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్, ఆర్ఎంవో జయమనోరి, మెడికల్ అండ్ హెల్త్ విభాగం టీఎన్జీవో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. పీఆర్సీపై ఉపాధి కల్పన శిక్షణశాఖ ఉద్యోగులు, తెలంగాణ క్లాస్ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ కరస్పాండెంట్ ఎస్కే చంద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 30% ఫిట్మెంట్పై సీఎం కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు పవన్కుమార్గౌడ్, ఇంచార్జి ప్రధాన కార్యదర్శి ఎం రవీంద్రకుమార్ ధన్యవాదాలు తెలిపారు. పెన్షనర్ల తరఫున సంఘం చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ శుభాకర్, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ ఫైనాన్స్ సెక్రటరీ జ్ఞానేశ్వర్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి: మంత్రి హరీశ్రావు
తమది ఉద్యోగుల సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పీఆర్సీని స్వాగతిస్తూ మంగళవారం అరణ్యభవన్లో ఉద్యోగులు నిర్వహించిన సంబురాల్లో హరీశ్రావు పాల్గొన్నారు. సంబురాల్లో భాగంగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ, అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.