సంగారెడ్డి : ఓ వివాహిత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కడుపు నొప్పి తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి, వెంట్రుకల తుట్టెను తొలగించారు.
వికారాబాద్ జిల్లా బూచన్పల్లి గ్రామానికి చెందిన అంతారం శ్రీలత(20).. గత ఒద్ది రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నప్పటికీ, కడుపునొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 17న సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రీలతకు సిటీ స్కాన్ చేయగా, కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు గుర్తించారు. దీంతో జనరల్ సర్జన్ డాక్టర్ కే కిరణ్కుమార్ నేతృత్వంలోని 8 మంది వైద్యుల బృందం శుక్రవారం రెండు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి, వెంట్రుకల తుట్టెను తొలగించారు. ప్రస్తుతం శ్రీలత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీలతకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.