ఖాట్మాండు : నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ నేపాల్లోని సింధుపాల్ చోక్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ముగ్గురు భారతీయులు సహా 20 మంది గల్లంతయ్యారని జిల్లా పాలన అధికారి అరుణ్ పొఖ్రెల్ తెలిపారు. మేలెంచి రివర్ కారిడార్ వెంట ఇండ్లలోకి నీరు చేరడంతో.. 200 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరంతా గత రెండు రోజులుగా స్థానిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. మంగళవారం నుంచి వరదలు వస్తుండగా.. ఇప్పటి వరకు 20 మంది గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు చైనీయులు ఉన్నారని తెలిపారు. వరంతా ఓ ప్రాజెక్టులో పని చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గల్లంతైన వారి జాబితాను విడుదల చేశారు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.